e-paper
Thursday, January 29, 2026

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 సిద్ధతలపై సీఎం సమీక్ష

డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు.

హైదరాబాదులోని కమాండ్ కంట్రೋల్ సెంటర్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేంనరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష జరిగింది.

సమ్మిట్‌కు దేశ–విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహ్వానితులకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి అంశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

సమ్మిట్‌కు సంబంధించి ఇప్పటికే దాదాపు 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు వివరించారు. పెట్టుబడుల ఒప్పందాల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం సూచించారు.

ప్రతి అంశంపై మాట్లాడే వక్తల జాబితా, వారికి కేటాయించే సమయపట్టిక ముందుగానే సిద్ధం చేసి, కార్యక్రమం పూర్తి క్రమశిక్షణతో నడవేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని ఆదేశించారు.

సమ్మిట్ కోసం ఏర్పాటు చేయనున్న స్టాల్స్ డిజైన్‌లు సీఎంకు వివరించగా, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో అవసరమైన సూచనలు ఆయన ఇచ్చారు.

సమ్మిట్ సందర్భంగా నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శన తెలంగాణ బ్రాండ్ ప్రతిష్ఠను మరింత పెంచేలా ఉండాలని, అలాగే సంప్రదాయ–సాంస్కృతిక కార్యక్రమాలను ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని డిజైన్‌లు నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!