చీకటి వెలుగు నల్లగొండ
.
బీసీల హక్కుల మరియు డిమాండ్ల సాధనకై బీసీఇంటలెక్చువల్స్ ఫోరం (బీసీఐఎఫ్) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9 వ తేదీ ఆదివారం రోజున నల్లగొండ జిల్లా కేంద్రంలోని G.L.గార్డెన్స్ నందు నిర్వహించనున్న “సామాజిక న్యాయ పోరాట సభ” ను విజయవంతం చేయాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షులు పాపని వెంకటరమణ కోరారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కలెక్టర్ శ్రీ టి.చిరంజీవులు ఐఏఎస్ (రిటైర్డ్) గారు హాజరు కానున్నారని ఆయన అన్నారు.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలో బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో “సామాజిక న్యాయ పోరాట సభ” గోడపత్రిక(పోస్టరు) మరియు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా BCTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నె శంకర్ గారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా పోరాటం చేస్తున్నారని, బీసీలలో చైతన్యానికి కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 9 వ షెడ్యూలులో చేర్చాలని, చట్టసభలైనలోక్ సభ, శాసనసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణలో స్వతంత్ర కమీషన్ వేసి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు చేయాలని, బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చి సమర్ధవంతంగా అమలుచేయాలని, బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలుచేయాలని, జాతీయ కులగణనలో ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీమ్ కోర్టుతో సహా ఉన్నత న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం/రిజర్వేషన్ కల్పించాలని, విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్సుమెంట్స్ సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లతో నిర్వహించే “సామాజిక న్యాయ పోరాట సభకు జిల్లాలోని బీసీ, ఎస్సీ , ఎస్టీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పెద్దయెత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్, కోఆర్డినేటర్ గుండెబోయిన జానయ్య యాదవ్, BCTA ప్రధాన జిల్లా అధ్యక్షులు రాందాసు, మిర్యాల మురళి SC, ST, ఉపాధ్యాయ సంగం మాజీ రాష్ట్ర బాధ్యులు కొంపెల్లి భిక్షపతి, మామిడి సైదులు తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments