ePaper
Friday, September 4, 2026

దసరా నాటికి కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్,విద్యుత్ ఉపకేంద్రం పూర్తి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చీకటి వెలుగు నల్గొండ.

వచ్చే దసరా నాటికి నల్గొండ మండలం కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో పాటు 33/11 విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కంచనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంచనపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగమిస్తుందని పేర్కొన్నారు. రూ.11 కోట్లతో చేపట్టిన కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను దసరా నాటికి పూర్తి చేసి, అదే రోజు 33/11 విద్యుత్ ఉపకేంద్రాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని ఆడబిడ్డలందరికీ తన సొంత ఖర్చుతో పట్టుచీరలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన రహదారులు ఉంటే పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా కంచనపల్లి నుంచి హైదరాబాద్, చిట్యాల వెళ్లేందుకు ఇప్పటికే ద్విమార్గ రహదారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తవుతాయని, ఆ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో బియ్యం మిల్లులు, గోదాముల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కంచనపల్లి గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం అందజేస్తోందని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో కంచనపల్లిలో మరో వంద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!