ఆగస్టు నెలాఖరు నాటికి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఒక్క వ్యాపార సంస్థ కూడా కొనసాగరాదు – కమిషనర్ శ్రీ బి. వంశీకృష్ణ*
చీకటి వెలుగు నల్లగొండ.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో **ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని పెంచడంతో పాటు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఏ వ్యాపార సంస్థ కూడా కొనసాగకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ శ్రీ బి. వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.
నగరంలోని అన్ని వ్యాపార సంస్థలపై షాప్ టు షాప్ సర్వే నిర్వహించి, ట్రేడ్ లైసెన్స్ లేని సంస్థలను గుర్తించి వెంటనే లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలను పాటించని సంస్థలపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే సీజ్ చేయడం లేదా మూసివేయడం వంటి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆగస్టు నెలాఖరు నాటికి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యాపార సంస్థ కూడా కొనసాగకూడదని* స్పష్టం చేసిన కమిషనర్, ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత వార్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, ప్రతి వార్డు అధికారి తన పరిధిలో *ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అక్రమ నిర్మాణాల నియంత్రణ మరియు ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, ప్రతి వార్డులో సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం పెంపు లక్ష్యంగా రెవెన్యూ వసూళ్లు మరియు ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments