తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు భూస్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజును నల్లగొండ పోలీసులు సాహసోపేత ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన ఈ ఆపరేషన్ ఉత్కంఠభరితంగా సాగింది.
విశ్వసనీయ సమాచారంతో ORRపై వెళ్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం ఆగగానే శ్రీకాంత్ కిందకు దూకి హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై కత్తి, ఇనుప రాడ్తో దాడికి పాల్పడ్డాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ముందుగా మూడు రౌండ్లు గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు దాడి కొనసాగించడంతో ఆత్మరక్షణలో అతని కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
భూస్మి శ్రీకాంత్ గతంలో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో పాటు 40కి పైగా చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు వేల్పుల అతేంద్ర అలియాస్ అత్తిలిని కూడా అరెస్ట్ చేశారు.
వందలాది సీసీటీవీ ఫుటేజీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మూడు ప్రత్యేక బృందాల సమన్వయంతో నిందితుల జాడను గుర్తించి ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్తో పాటు కానిస్టేబుళ్లు శివరాజ్, నరేష్, గులాందస్తగిరి, కమల్ కిషోర్, సాయి, జునైద్, ఆశ్రర్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను ప్రకటించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments