చీకటి వెలుగు నల్లగొండ. నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ మరియు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.అంతేకాక 2 సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణంలోని మహిళలు షాపింగ్, ఇతర అవసరాల కోసం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆస్పత్రికి చేరుకోవడానికి ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై వారు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పారు.

సిటీ బస్సు సర్వీసులు చెరువుగట్టు–ఎస్ఎల్బీసీ మార్గంతో పాటు ధరవేశి పురం నుంచి దుప్పలపల్లి వరకు నడిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నల్గొండకు అదనంగా 30 బస్సులు కేటాయించడం జరిగిందని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్ద పెట్రోల్ పంపు, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్, రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూములు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధికి రూ.83 కోట్ల రూపాయలతో తాగునీటి శుద్ధి (వాటర్ ఫిల్టర్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ సిటీగా రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కురిసిషా ఖాన్ ,మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక ఆర్థిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి,
కార్పొరేటర్ కవిత, రమేష్,
లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
_
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments