చీకటి వెలుగు – నల్గొండ
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్ష నిమిత్తం బుధవారం నల్గొండ జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలు, పరికరాల పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను సేకరించారు.
ఈ-ఔషధి మెడిసిన్ విభాగం, టీ-హబ్ డయాగ్నస్టిక్, రేడియాలజీ, పురుషుల శస్త్రచికిత్స వార్డు, ఐసీయూ, సీటీ స్కాన్ విభాగాలను సందర్శించిన ఆయన ఆయా విభాగాల్లో ఉన్న వైద్య పరికరాల పనితీరు, సేవల నాణ్యత, రోగుల వివరాలను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను తనిఖీ చేసి మందుల నిల్వలు, సరఫరా విధానం, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో భాగంగా జిల్లాను సందర్శించినట్లు తెలిపారు. తాను టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్య పరికరాలు, మందుల సరఫరా వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిశీలనల ద్వారా ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, సదుపాయాలను గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
రోగుల ఆరోగ్య సంరక్షణపై వారి నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకుని, అన్ని వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం అవసరమని వైద్యులు కోరినట్లు, ప్రస్తుతం ఉన్న సీటీ స్కాన్ యంత్రానికి మరమ్మతులు అవసరమని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఓపీ రికార్డులు, వైద్య సేవలు, ఈ-ఆరోగ్యం, హెచ్ఎంఎస్, ఈ-ఔషధ కార్యక్రమాల అమలు, మందుల పంపిణీ, డేటా ఎంట్రీ తదితర అంశాలపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫిరధౌసి, ఫార్మసిస్టును అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు వ్యవస్థల ద్వారా అందుతున్న సేవలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్తో పాటు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments