నల్గొండ, శుక్రవారం: నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు పి.ఏ.డి (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) పై కీలక సూచనలు చేశారు. కాళ్లు, పాదాలకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోవడం ఈ వ్యాధి ప్రధాన కారణమని తెలిపారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రంగా ఉండి, చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నరాల సమస్యల కారణంగా కొందరికి నొప్పి తెలియకపోవచ్చని, ఇది పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తుందని పేర్కొన్నారు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని వివరించారు. డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను నియంత్రణలో ఉంచుకోవాలని, పొగతాగడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రతిరోజూ పాదాలను పరిశీలించడం, చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా వాసుల కోసం ప్రతి నెల మూడవ బుధవారం పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్లో ఓపిడి సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో డాక్టర్ వినయ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ కోకా ప్రవీణ్ కుమార్, సహాయ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments