ePaper
Saturday, September 5, 2026

నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతా: మంత్రి కోమటిరెడ్డి

జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ..

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్య భారతదేశమని, స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదని, దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడం, సమాజం పట్ల బాధ్యతగా నిలబడటమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని అన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా పోషించిన పాత్రను మంత్రి గారు గుర్తుచేస్తూ, నల్లగొండ అంటే పోరాటం, త్యాగం, తిరుగుబాటు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం వంటి ఎందరో మహనీయుల పోరాట స్ఫూర్తి ఈ గడ్డకు గర్వకారణమన్నారు.

“నల్లగొండ నా ఊపిరి. మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు నా శ్వాస ఉన్నంత వరకు పాటుపడతా. నల్లగొండ నీటి కష్టాలు తీర్చేందుకు, అభివృద్ధి బాటలో అగ్రభాగాన నిలబెట్టేందుకు నా సర్వశక్తులు ధారపోస్తా” అని మంత్రి గారు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలి ఉద్యమంలోకి వెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ, అధికారం శాశ్వతం కాదని.. ప్రజల కోసం చేసిన పోరాటం, త్యాగమే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, సన్నబియ్యం, ఆరోగ్యం, విద్య, రహదారులు, తాగునీరు వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు:

• 5.35 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.715 కోట్లు జమ
• 1.99 లక్షల మందికి ప్రతి నెల రూ.51.28 కోట్ల చేయూత పింఛన్లు
• 17,873 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 4,360 గృహాలు పూర్తి
• గృహజ్యోతి పథకం కింద 2.56 లక్షల కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లులు
• రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 38,403 మంది పేదలకు రూ.119.11 కోట్లతో వైద్య సేవలు
• 8.73 కోట్ల ఉచిత ఆర్టీసీ ప్రయాణాల ద్వారా మహిళలకు రూ.408.20 కోట్ల ప్రయోజనం
• 5.42 లక్షల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ
• 81,279 కొత్త రేషన్ కార్డుల జారీ
• 6,092 కి.మీ.ల 441 రహదారుల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల HAM ప్రాజెక్టులకు శ్రీకారం
• నల్లగొండ పట్టణానికి 24 గంటల తాగునీటి లక్ష్యంతో రూ.83 కోట్ల వాటర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, అదనంగా రూ.300 కోట్ల నిధుల మంజూరు
• ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం
• యువత కోసం రూ.20 కోట్లతో NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
• యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

నల్లగొండను కేవలం పోరాటాల గడ్డగానే కాకుండా.. అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలిచే జిల్లాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తెలిపారు.

“అమరవీరుల త్యాగాల సాక్షిగా.. నల్లగొండను అగ్రభాగాన నిలబెడతానని మీ బిడ్డగా మాట ఇస్తున్నాను” అని మంత్రి గారు అన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!