చీకటి వెలుగు, నల్గొండ
ప్రభుత్వానికి కరువుపై చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మరో15 రోజుల్లో రిజర్వాయర్లలోని నీళ్లు అయిపోతాయని, గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నా వినియోగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తమ హయాంలో కరువులోనూ నాగార్జునసాగర్ కింద రైతులకు సాగునీరు ఇచ్చారని, మిషన్ భగీరథ ద్వారా కూడా తాగునీటి సరఫరా సరిగా చేయడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. 2014కు ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని విమర్శించారు. సాగర్ నుంచి 50 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. నల్లగొండ, హైదరాబాద్కు త్వరలో మంచినీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా సమీక్షల పేరుతో ప్రభుత్వం షోయింగ్ చేస్తోందని, ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని, ఇంకుడు గుంతల పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రవాలని ఉత్తమ్కు సవాల్ విసిరారు. కన్నెపల్లి పంపులు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలతో నీళ్లు ఇవ్వొచ్చని ఆధారాలతో నిరూపిస్తానన్నారు. మంత్రి పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలంటూ ఉత్తమ్పై డిమాండ్ చేశారు. ఇప్పటికే 150 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, ఇది దరిద్రపు ప్రభుత్వమని తీవ్ర విమర్శలు చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments