నేడు బోనాలు.. భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు
చీకటి వెలుగునల్లగొండ,
నల్లగొండ పట్టణంలోని దుప్పలపల్లి రోడ్డు ద్వారకానగర్లో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఆలయాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి ఈ నెల 5న ప్రారంభమైన ఉత్సవాలు 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మహోత్సవాల్లో భాగంగా సోమవారం గణపతి పూజ, స్థాపిత దేవతామూర్తుల పూజలు,నవదుర్గా హోమం, వాస్తు పర్యగ్నీకరణ, గర్తన్యాసం,నవరత్న న్యాసం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తులా లగ్న సుముహూర్తంలో వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, మంత్రి ప్రధాన సహాయకుడు మధుసూదన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మల మోహన్రెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంతో 8వ డివిజన్లో కార్పొరేటర్ వజ్జ సంతోషిని–రమేష్ యాదవ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, తాగునీటి సమస్యలను సకాలంలో పరిష్కరించి, అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందాలని, అమ్మవార్ల కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలపై అమ్మవార్ల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, కాలనీ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జ సంతోషిని–రమేష్ యాదవ్ అధ్యక్షతన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తదుపరి శిఖర కలశ స్థాపన, అమ్మవార్ల దివ్యదర్శనం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అన్నదానం చేపట్టారు. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలను వాస్తు, జ్యోతిష్య శాస్త్ర విశారదుడు, దేవాలయ నిర్మాణ ప్రణాళికాదారు, అర్ధశతాధిక దేవతా విగ్రహ ప్రతిష్ఠాచార్యుడు ఆచార్య ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీ పెద్దలు, ప్రజలు, దేవస్థాన కార్యనిర్వాహకుల సహకారంతో ప్రతిష్ఠా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రధాన అర్చకులను ఘనంగా సన్మానించారు. నేడు బోనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వేముల సైదమ్మ-లక్ష్మయ్య, వేముల నాగరాజు,వేముల శ్రీను స్వామి, నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments