చీకటి వెలుగు నల్లగొండ.
నల్లగొండ పట్టణంలోని రామగిరిలో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో నేడు మహిళలు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించుకున్నారు
శ్రావణ మాస బోనాల జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆలయ అర్చకులు, చైర్మన్ ఎలిజాల అంజయ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్రిశక్తి స్వరూపిణిగా ముత్యాలమ్మ, రేణుకా ఎల్లమ్మ, మహంకాళి మాతగా భక్తులచే కొలువబడుతున్న అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం, బలిహరణ, మహాకుంభారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవకలశారాధన, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానంతో పాటు బలిహరణ, మహాకుంభారాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 12న సాయంత్రం 7 గంటలకు అమ్మవారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారి రథం పట్టణంలోని ప్రధాన పురవీధుల మీదుగా ఊరేగనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. బోనాల జాతరను ప్రారంభించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నల్లగొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుమ్ముల మోహన్రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. పుట్ట బత్తిని సత్యనారాయణ దంపతులు ప్రత్యేక అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. 47వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు అబ్బగోని కవిత రమేష్గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు, చైర్మన్ ఎలిజాల అంజయ్య కోరారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా ఆలయ పూజారిని సంప్రదించాలని సూచించారు. అమ్మవారి బోనాల జాతరను విజయవంతం చేసేందుకు భక్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments