ePaper
Saturday, September 5, 2026

చందనపల్లిలో బీఆర్‌ఎస్‌లోకి 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు

చీకటి వెలుగు నల్లగొండ.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తన శిబిర కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం వెనుక ఉన్న ఆశయాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాలకు అందిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రస్తుతం ప్రజలకు దూరమయ్యాయని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత స్థానిక మంత్రి తన ఖాతాలో వేసుకుంటున్నారని భూపాల్‌రెడ్డి విమర్శించారు. గతంలోనే మంజూరైన ఎల్లమ్మగుడి–రామగిరి డీఈఓ రహదారి పనులకు శంకుస్థాపన చేసి, వాటిని తానే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మర్రిగూడ బైపాస్ రహదారికి గతంలో రూ.45 కోట్లు మంజూరు చేయించి, పనులు దాదాపు పూర్తయ్యే దశలో నిలిపివేశారని ఆరోపించారు. అనంతరం మరో రూ.15 కోట్లు అదనంగా అంచనా వ్యయం పెంచి, కొన్ని ప్రాణనష్టాలు జరిగిన తర్వాత తాను ధర్నా చేపట్టడంతో పనులు తిరిగి ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికైనా చవకబారు ప్రచారాలను పక్కనపెట్టి నల్లగొండ అభివృద్ధికి మరో రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని భూపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల ధర్వేశిపురం నుంచి, తాజాగా చందనపల్లి నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రజల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులకు సంకేతమన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన వారంతా ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, భవిష్యత్‌లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీ నారాబోయిన బిక్షం, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, జి.ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్, జిల్లా సర్పంచుల జేఏసీ చైర్మన్ మేకల పల్లవి అరవింద్‌రెడ్డి, సల్వాది సైదులు, జిల్లెల రేణుక రాజు, రేఖల మౌనిక, తీగల యాదయ్య, మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు తవిటి కృష్ణ, పొగాకు గట్టయ్య, మాజీ సర్పంచులు గుండెబోయిన జంగయ్య, ఎలుక శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్‌తో పాటు తంతెనపల్లి శంకర్, వెంకన్న, ఇంద్రయ్య, గోపాల్, పవన్‌కళ్యాణ్, సాలయ్య, సందీప్, జక్కలి రాములు, తంతెనపల్లి స్వామి, సురేష్, రవి, చిన్న శంకర్, పాలడుగు శంకర్, తెల్లమల్ల చంటి తదితరులు ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!