చీకటి వెలుగు నల్గొండ.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కతల్గూడలో డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేసి, ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. అధికారం, సంపద కంటే ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చిన పాపన్న గౌడ్ తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు.
ప్రజల హక్కుల కోసం సాగించిన ఆయన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని బుర్రి చైతన్య అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడిన పాపన్న గౌడ్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం నెలకొల్పేందుకు ఆయన ఆశయాల బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
పాపన్న గౌడ్ కేవలం ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, ప్రజల కోసం పోరాడిన ప్రజా యోధుడని మేయర్ పేర్కొన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించడంతోపాటు యువతలో పోరాట స్ఫూర్తి, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి , డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ గారు, అబ్బగోని రమేష్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments