*నైట్ బీట్ పోలీస్ సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ బ్యాటన్స్, ఫైబర్ లాఠీలు అందజేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.
చీకటి వెలుగు నల్గొండ.
ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో రాత్రి వేళల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర సహాయం అందించే నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా పోలీసు శాఖ మరో కీలక చర్య చేపట్టింది. నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అవసరమైన రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ బ్యాటన్స్, ఫైబర్ లాఠీలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో నైట్ బీట్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, చీకటి వీధులు, నిర్మానుష ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై నిరంతరం అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది భద్రత కూడా అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఎస్పీ, రాత్రి సమయంలో వాహనదారులకు పోలీసులు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ జాకెట్లు ఉపయోగపడతాయని, దీంతో రోడ్డు ప్రమాదాల అవకాశాలు తగ్గడంతో పాటు విధుల నిర్వహణ మరింత సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ఎల్ఈడీ బ్యాటన్స్ ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలు, అత్యవసర పరిస్థితుల్లో హెచ్చరిక సంకేతాలు ఇవ్వడంలో ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. ఫైబర్ లాఠీలు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అవసరమైన సందర్భాల్లో ఆత్మరక్షణకు, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రతి నైట్ బీట్ అధికారి తన పరిధిలోని కాలనీలు, గ్రామాలు, వ్యాపార సముదాయాలు, ఏటీఎంలు, బ్యాంకులు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఒంటరి ఇళ్లు వంటి సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించిన వెంటనే తనిఖీలు చేపట్టి, అవసరమైతే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
దొంగతనాలు, చైన్ స్నాచింగ్, వాహనాల చోరీలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలను ముందుగానే అరికట్టేలా గస్తీని మరింత పటిష్టం చేయాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందేలా పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం అవసరమైన వారికి వెంటనే స్పందించి పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి భద్రత, విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జిల్లా ఎస్పీ, ఆధునిక సాంకేతిక పరికరాలు, భద్రతా సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి పోలీసింగ్ను మరింత ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడంలో నైట్ బీట్ వ్యవస్థ అత్యంత కీలకమని, ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా విధులు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఆర్.ఐ లు సంతోష్, శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments