చీకటి వెలుగు నల్లగొండ,
వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. శరత్ చంద్ర నగరంలోని 5, 38, 42 డివిజన్లలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్ల డీసిల్టింగ్ పనులు, భూగర్భ మురుగునీటి (యూజీడీ) లైన్ల శుభ్రపరిచే కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించే పనులను, అలాగే గల్పర్ మిషన్ల సహాయంతో యూజీడీ లైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త, వ్యర్థాలను తొలగించే పనులను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడా నీటి నిల్వలు ఏర్పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
డ్రైన్లు, మ్యాన్హోల్స్, యూజీడీ లైన్ల డీసిల్టింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాకాలంలో దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు పారిశుధ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.
ప్రజలు కూడా నగర పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని మేయర్ కోరారు. గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, నిర్మాణ వ్యర్థాలు తదితరాలను డ్రైన్లు, కాలువల్లో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైన్లలో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో నీటి నిల్వలు, పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలు లేదా పారిశుధ్య లోపాలు గమనించిన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రీ జి. శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments