– ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి
నల్గొండ: అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యకస, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు తుమ్మల పద్మ, కుంచెం కావ్య, శ్రీవాణి అధ్యక్షత వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు, బహుమతులతో ముగిసే రోజు కాదని అన్నారు. ఇది కార్మిక మహిళల చరిత్రలో రక్తం, చెమట, ధైర్యం, తెగువతో చెక్కబడిన పోరాట దినమని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా, సమాన హక్కుల కోసం, రాజకీయ హక్కుల సాధన కోసం వీధుల్లోకి వచ్చి పోరాడిన మహిళల త్యాగాలను స్మరించుకునే రోజు ఇదని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా ఉద్యమాలు మరింత బలంగా రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ పేద మహిళల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తూ మహిళల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అదే స్ఫూర్తితో మహిళా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఐద్వా జిల్లా నాయకురాలు జిట్టా సరోజ, కొండ అనురాధ, భూలక్ష్మి, చెనబోయిన నాగమణి, సుల్తానా, గోలి వెంకటమ్మ, బహిరోజు ఇందిరా, మంజుల, పుష్ప, గుండాల నరేష్, కిరణ్, అవుటా రవీందర్, స్పందన, కీర్తన, షాలిని, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments