చీకటి వెలుగు నల్లగొండ.

నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సూపర్ సిటీగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద రూ.65 కోట్ల వ్యయంతో నిర్మించిన పైవంతెనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, మర్రిగూడ పైవంతెన పరిసరాలను హైదరాబాద్ తరహాలో చిత్రకళ, గోడచిత్రాలు, ప్రముఖుల చిత్రాలతో ఆకర్షణీయంగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రజలకు సులభంగా గుర్తించేలా దిశా నిర్దేశక ఫలకాలు, పేరుపలకలు ఏర్పాటు చేయాలని రహదారులు–భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. పైవంతెన నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలు కూడా తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రూ.750 కోట్లతో బాహ్య వలయ రహదారికి ఆమోదం లభించిందని గుర్తుచేశారు. చర్లపల్లి, మర్రిగూడెం సహా పరిసర గ్రామాల్లో మట్టి రహదారులు లేకుండా అన్ని చోట్ల సిమెంట్ కాంక్రీట్ రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.300 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపినట్లు వెల్లడించారు. రైల్వే మార్గం వద్ద మరో పైవంతెన కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణాల కోసం భూములు కోల్పోయిన రైతులకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని మంత్రి చెప్పారు. పట్టణ తాగునీటి పథకానికి ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, మరో రూ.290 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నెల రోజుల్లో ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ నియోజకవర్గంలో ద్విమార్గ రహదారుల నిర్మాణంతో పాటు అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బ్రాహ్మణవెల్లెముల వద్ద చిన్న ట్యాంక్బండ్ అభివృద్ధి, బక్కతాయికుంట ఎగువ భాగంలో రూ.7 కోట్లతో చెరువు అభివృద్ధి పనులు, పట్టణ అవసరాలకు అనుగుణంగా అదనపు విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నల్గొండ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులను ద్విమార్గాలుగా విస్తరిస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో కలిపే విశాల రహదారులు లేకపోయాయని, ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేస్తున్నామని చెప్పారు. నల్గొండ–దేవరకొండ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే తరహా పనులు చేపట్టి రహదారులు–భవనాల శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో నిరుపేదలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కార్పొరేటర్ పెరిక స్వాతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూరి రమేష్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, ప్రేమ్కరణ్రెడ్డి, ఆర్డీవో వై. అశోక్రెడ్డి, రహదారులు–భవనాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments