చీకటి వెలుగు నల్లగొండ,
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించాలని మేయర్ బుర్రిచైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన విత్తన మేళా – పంటల సాగుపై అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతులకు పంటల ఎంపిక, పంట మార్పిడి, నాణ్యమైన విత్తనాల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేయర్ చైతన్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకే పంటను పదేపదే సాగు చేయడం వల్ల నేల సారవంతత తగ్గిపోతుందని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ధృవీకరించిన విత్తనాల వినియోగం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు రైతులకు అదనపు ఆదాయ మార్గంగా నిలుస్తుందని వివరించారు.
విత్తన మేళాలో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పంటల సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ గిరి ప్రసాద్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి, రెండవ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, పి.ఎస్.ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ చంద్ర, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments