నల్లగొండ:
జననమే కానీ మరణం లేని నేతగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాటి-నేటి తరాలకు ఆదర్శ పురుషుడని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి అన్నారు. “మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే నినాదంతో దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహానాయకుడు నేతాజీ అని ఆయన పేర్కొన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్లగొండ కేంద్రంగా ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన జనగణమన ఉత్సవ సమితి ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ—
ఒక్క విమర్శ కూడా ఎదుర్కోని స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ అని కొనియాడారు. అత్యంత చిన్న వయసులోనే పొందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రత్యేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి మహనీయుల త్యాగాల వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం సులభతరమైందన్నారు.
అలాగే, ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ— పట్టణ ప్రజల సహకారంతో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు చేపట్టామని, త్వరలోనే దేవరకొండ, నకిరేకల్, హాలియా పట్టణాల్లో కూడా నిత్య జాతీయ గీతాలాపన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నేటి యువతరం నేతాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమితి సహాయ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ— యువత మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిస కాకుండా నేతాజీ అడుగుజాడల్లో నడవాలని కోరారు. జనగణమన ఉత్సవ సమితి ద్వారా ఇలాంటి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, అందరూ దేశభక్తి భావనతో ముందుకు రావాలని అన్నారు.
అంతకు ముందు ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు జరిగే నిత్య సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జనగణమన గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి గౌరవ సలహాదారు నండూరి రామిరెడ్డి, కోశాధికారి పోలోజు నాగేందర్, ఉపాధ్యక్షులు గుంటి రామకృష్ణ, చందా శ్రీనివాస్, పోలా జనార్దన్, అలుగుబెల్లి శ్యాంసుందర్ రెడ్డి, మేక జయపాల్ రెడ్డి, చర్లపల్లి గణేష్, భరద్వాజ్ మహేష్,
ఏబీవీపీ నాయకులు నాగరాజు, ఆవుల సంపత్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments