హైదరాబాద్, జనవరి 24, 2026:
రాజ్యాంగంలో పొందుపర్చిన భావప్రకటన స్వేచ్ఛలో భాగమే పత్రికా స్వేచ్ఛ అని, జర్నలిస్టులు పత్రికా చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జిల్లా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు పొందిన విలేకరులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మీడియాలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాలు, జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉండాలని తెలిపారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో జర్నలిస్టులు ఏఐ, చాట్ జీపీటీ వంటి ఆధునిక సాధనాలపై అవగాహన పెంచుకొని వాటిని జర్నలిజం అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. వాస్తవ నిర్ధారణ లేకుండా వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వృత్తి గౌరవానికి భంగం కలిగిస్తుందని హెచ్చరించారు.
రెండో రోజు శిక్షణలో భాగంగా
“తెలంగాణ జర్నలిజం – గతం, వర్తమానం, భవిష్యత్తు” అంశంపై ప్రముఖ సంపాదకులు కే. శ్రీనివాస్, “భాష – తప్పులు” అంశంపై వెలుగు దినపత్రిక నెట్వర్క్ ఇన్చార్జ్ చిల్ల మల్లేశం, “వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు” అంశంపై దిశ దినపత్రిక ఎడిటర్ మార్కెండేయ, “నైతిక నియమాలు, మీడియా చట్టాలు” అంశంపై కే. శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు.
శిక్షణ ముగింపులో పాల్గొన్న జర్నలిస్టులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందేహ నివృత్తి చేయగా, అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ తరఫున సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, నల్లగొండ జిల్లా జర్నలిస్టు నాయకులు కంది సూర్యనారాయణ, అబ్బోజు మదనాచారి, పిట్టల రామకృష్ణ, కాకునూరి జగదీశ్వరచారి, వెన్నమల్ల రమేష్ బాబు, గొర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments