నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగిరి దేవాలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన భూముల సేకరణకు చర్చలు జరుగుతున్నాయని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. దేవాలయ భూములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని చెప్పారు.
నల్గొండ ప్రజలు శ్రీరాముని కృపతో సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments