నల్లగొండ: రాష్ట్ర బడ్జెట్లో బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. జనాభాలో 56.35% ఉన్న బీసీలకు నామమాత్రంగా మాత్రమే నిధులు కేటాయించడం అన్యాయమని విమర్శించింది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి బీసీల కోసం కేవలం ₹12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది కంటి తుడుపు చర్యగా భావిస్తున్నామని ఫోరం పేర్కొంది. కేటాయించిన నిధులను సబ్ప్లాన్ ప్రకారం పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
గత ఆర్థిక సంవత్సరం 2025–26లో కేటాయించిన ₹11,400 కోట్లలో కేవలం ₹3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన ₹7,900 కోట్లు వినియోగం కాకుండా ఉన్నాయని తెలిపారు. ఈ నిధులను మార్చి 31లోపు పూర్తిగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే బీసీ కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న ₹5,000 కోట్ల బీసీ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 10,000 ర్యాంక్ లోపు ఉన్న విద్యార్థులకు మాత్రమే 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని, దీనిని అన్ని బీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని కోరారు.
అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు బడ్జెట్ పెంపు కోసం ఐక్యంగా పోరాడాలని, కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫోరం పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments