చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. హనుమంతరావు గారు ఈరోజు (తేదీ: 29 జనవరి 2026) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చౌటుప్పల్ ఆర్.డి.ఓ. శ్రీ శేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారితో పాటు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన రిజిస్టర్లు, అభ్యర్థులు సమర్పించిన పత్రాలను కలెక్టర్ గారు రిటర్నింగ్ అధికారుల వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందా లేదా అన్న విషయంపై ఆర్.డి.ఓ., RO, ARO లతో పాటు మున్సిపల్ కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నామినేషన్ల పర్వం పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ, ఎలాంటి గందరగోళం లేకుండా ప్రక్రియను నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. వెంకట్రామ్ రెడ్డి గారికి కలెక్టర్ ఆదేశించారు.
అలాగే నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు అంశాలపై ఆర్.డి.ఓ. శేఖర్ రెడ్డితో చర్చించి, శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు, కంట్రోల్ రూమ్, సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశామని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు.
ఈ తనిఖీలో ఎన్నికల విభాగానికి చెందిన RO లు, ARO లు, అధికారులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, RO అంజయ్య, అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments