ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం సోమవారం నుంచి ఫిబ్రవరి 28 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
తొలి విడతగా నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని మండలాలు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల సర్పంచులకు ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు సర్పంచులకు ఇచ్చినది ఒక గొప్ప అవకాశమని అన్నారు. మహాత్మా గాంధీ పేర్కొన్నట్లుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.
చట్టపరంగా సర్పంచుల హక్కులు, బాధ్యతలు, వివిధ ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన కలిగి ప్రజలకు సుపరిపాలన అందించాలని నూతన సర్పంచులను కోరారు. ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చిస్తామని తెలిపారు. సర్పంచులు మంచి నడవడికతో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె. అనిల్ కుమార్, హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ డి. రాఘవేంద్రరావు, డీపీఓ శంకర్ నాయక్, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments