చీకటి-వెలుగు, మిర్యాలగూడ, అక్టోబర్ 31:
మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మృతురాలు నగిల్ల వెంకమ్మ (35), లింగయ్య (మృతుడు) భార్య, బీసీఏ – రజక కులానికి చెందిన ములకల కాలువ గ్రామానికి చెందినవారు. భర్త మరణించడంతో ఒక్కడే బాబు ఉన్న వెంకమ్మ జ్వరంతో, ఆస్తమాతో, జలుబుతో బాధపడుతుండగా గ్రామస్థులు ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా ఉదయం 8 గంటల సమయంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, డ్యూటీలో ఉన్న డాక్టర్ డ్యూటీ ముగియబోతున్న కారణంగా పేషెంట్ను సరిగ్గా పట్టించుకోలేదని సమాచారం. వార్డ్ సిస్టర్కి ఆక్సిజన్ ఇవ్వమని చెప్పి వెళ్లిపోయారు. కానీ డ్యూటీలో ఉన్న నర్సు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆక్సిజన్ అందించకపోవడంతో, సకాలంలో చికిత్స అందక వెంకమ్మ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందారు.
ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ఆసుపత్రి ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆర్ఎమ్ఓ రాంబాబు గారు ఆ సమయానికి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీడియాను చూసి అక్కడినుంచి పారిపోయారు. “వివరణ ఎవరు ఇస్తారు?” అని అడగగా, “సూపరింటెండెంట్ గారు వస్తున్నారు” అని చెప్పి మీడియా నుంచి తప్పించుకున్నారు. అయితే సూపరింటెండెంట్ కూడా ఆసుపత్రికి రాలేదు.
స్థానికులు, బంధువులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డ్యూటీ డాక్టర్, నర్సు మరియు ఆసుపత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments