మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా 40 రోజులపాటు కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 100 శాతం సబ్సిడీతో మిషన్లు అందజేశారు. ఒక్కో మిషన్ విలువ సుమారు రూ.10,000 కాగా, ఎలక్ట్రికల్ మిషన్లు కూడా పంపిణీ చేశారు. మిగిలిన లబ్ధిదారులకు విడతలవారీగా మిషన్లు అందజేస్తామని అధికారులు తెలిపారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నల్గొండకు మొత్తం 1152 కుట్టుమిషన్లు మంజూరైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ మిషన్లను మహిళలు ఖాళీగా ఉంచకుండా వినియోగించి ఆదాయం పొందాలని సూచించారు.
మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరితే ప్రభుత్వం ద్వారా రుణాలు పొందే అవకాశముందని, సెట్విన్ ద్వారా టైలరింగ్, బ్యూటిషియన్ వంటి కోర్సుల్లో శిక్షణలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉన్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. కుట్టుమిషన్ ద్వారా స్వయం ఉపాధి పొందాలని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments