హైదరాబాద్ | మీడియా వార్తలు | జనవరి 23:
ప్రతి నిత్యం జర్నలిస్టులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భాషా–సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవన అనుభవాలను పంచుకుంటూ నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో తాను విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. జర్నలిజంతో ముడిపడిన అనేక అంశాలు, అనుభవాలను వివరించారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏఐని ఉపయోగిస్తున్న జర్నలిస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. జర్నలిజంలో పరిపూర్ణత సాధించాలంటే ఏఐపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి అని చెప్పారు. అలాగే, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరుణంలో జర్నలిస్టులు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్తలను ప్రచురించాలి లేదా ప్రసారం చేయాలని సూచించారు.
శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు
“గ్రామీణ వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా” అంశంపై రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఉమా మహేశ్వర రావు, “ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఏఐ, సోషల్ మీడియాలో పాటించాల్సిన విధానాలు” అంశంపై ముద్దం నర్సింహస్వామి, “నేర వార్తలు” అంశంపై సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి, “సమాచార హక్కు చట్టం–2005” పై సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి అవగాహన కల్పించారు.
శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీ, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments