ePaper
Tuesday, September 8, 2026

అంబేడ్కర్ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నేతల వినతిపత్రం.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

చీకటి వెలుగునల్లగొండ,

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు వారం రోజులుగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల ముగింపులో భాగంగా మంగళవారం నల్లగొండలో భారీ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నాయకత్వంలో 500 మందికిపైగా మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడులు, ప్రతిపక్ష నాయకులపై పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ నాయకుడు రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ పిలుపుతో కాంగ్రెస్‌ హామీలపై వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తోందని ఆరోపించారు. రైతుబీమా, దళితబంధు పథకాలు నిలిచిపోయాయని, మిషన్‌ భగీరథ, రైతుబంధు పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయని, కొత్తగా ఎవరికీ ప్రయోజనం అందడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, పెన్షన్ల పెంపు కూడా అమలు కాలేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రకటించిన హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడిచినా నెరవేర్చలేదని విమర్శించారు.
వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, అధికారులకు ప్రజావాణి ద్వారా వినతులు సమర్పించామని రవీంద్రకుమార్‌ తెలిపారు. చివరగా అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాడి చేసి అవమానించారని ఆరోపించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యేలపైనా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు స్పీకర్‌పై తాటా మధు వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్సీలు తాటా మధు, నవీన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, కోర్టు ప్రభుత్వాన్ని మందలించినా తీరు మారలేదని అన్నారు.
కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి ‘చావు డప్పు’ కొడతామని చెప్పి పోలీసులను పంపడం ఏమిటని రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుకు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్‌ నాయకుడు బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏమీ లేవని ఆరోపించారు. ప్రభుత్వం చేసిందేమీ లేక ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ పోరుబాట పట్టిందన్నారు. అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అవమానించేలా దాడులు చేశారని ఆరోపించారు. ఈ ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ముట్టడి అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అక్కడికి వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఇతర అంశాలతో దృష్టి మళ్లిస్తోందని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద సోమవారం అరాచక పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. వాటిని పక్కన పెట్టి కాంగ్రెస్‌ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ముట్టడి కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ‘చావు డప్పు’ కొట్టడం, ఒకరి మరణాన్ని కోరుకోవడం వంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేసీఆర్‌ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, రాంచందర్‌నాయక్, కటికం సత్తయ్యగౌడ్, మాలే శరణ్యరెడ్డి, రేగట్టే మల్లికార్జునరెడ్డి, మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, కరీం పాషా, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకటయ్య, మైనం శ్రీనివాస్, భువనగిరి దేవేందర్, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, దోటి శ్రీనివాస్, మారగోని భవాని, గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి, మల్లీశ్వరి అశోక్,
పలువురు నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!