– బిజెపి నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకన్న
బిజెపి జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన ఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినదే తప్ప, దానికి కులాలతో ఎలాంటి సంబంధం లేదని బిజెపి నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకన్న స్పష్టం చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో జిల్లా అధ్యక్షుడు అక్కడ లేనప్పటికీ, ఆయనను ఈ ఘటనలోకి లాగడం సరైంది కాదన్నారు.
బుధవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం అని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేశారు.
వాజ్పేయి హయాం నుంచి నరేంద్ర మోడీ వరకు బీసీ వర్గాలకు చెందిన అనేక మందిని కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లా బిజెపిలో కూడా గతంలోనూ, ప్రస్తుతం కూడా ఎంతో మంది బీసీ నాయకులు కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారని తెలిపారు.
బీసీల సంక్షేమం, భద్రత కోసం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమేనని మిరియాల వెంకన్న పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే, దానిని రాజకీయ కుట్రగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన ఆయన, నిజాలు నిగ్గు తేల్చాలని పోలీసులను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్, కార్యాలయ కార్యదర్శి మంగలిపల్లి కిషన్, శాంతి స్వరూప్, శ్రీధర్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments