నల్లగొండ: హిందూ సంఘటనే దేశ రక్షణకు మార్గమని, హిందూ ఐక్యత సాధనకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తున్నదని ఆర్ఎస్ఎస్ నల్లగొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య అన్నారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్దీ ఉత్సవాల భాగంగా, నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నగర ప్రధాన వీధుల గుండా పథ్ సంచలన్ (మార్చ్) నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల శాఖలతో విస్తరించి, ప్రపంచంలోని అనేక దేశాల్లో దేశభక్తి, హిందుత్వ విలువల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం అని పేర్కొంటూ, వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు.
దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన — సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వాధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతలు — పాటించాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్దీ ఉత్సవాల భాగంగా త్వరలో ఇంటి ఇంటి జనజాగరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. దేశ రక్షణ, వ్యక్తి నిర్మాణం, హిందుత్వ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతించాలని ఆయన కోరారు.
దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేశాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సహ సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య, నగర సంఘచాలక్ దోసపాటి శ్రీనివాస్, విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments