రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్:
రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలను నోడల్ అధికారులు, పోలింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, ఎన్నికల నోడల్ అధికారులు, అదనపు కలెక్టర్లు తదితరులతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ —
ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (Model Code of Conduct) ఖచ్చితంగా పాటించాలన్నారు. మండల స్థాయి ఎన్నికల అధికారులు ఒక టీమ్గా ఏర్పడి సమన్వయంగా పని చేయాలని సూచించారు.
అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు, సమావేశాలకు ముందుగా అనుమతి తీసుకోవాలని, ఆ సమాచారం ఖర్చుల పర్యవేక్షణ బృందానికి ఇవ్వకపోతే నియమాల ప్రకారం ఖర్చుల పరిశీలన జరుగుతుందని హెచ్చరించారు. సరైన అనుమతులు లేకుండా సభలు నిర్వహించరాదని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్లో తప్పనిసరిగా పోలీస్ శాఖ సిబ్బంది ఉండాలని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ — నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రొసైడింగ్ & అసిస్టెంట్ ప్రొసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు వంటి అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించామని, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
డీసీపీ సునీతా రెడ్డి మాట్లాడుతూ — పోలీసు శాఖ అన్ని విభాగాలతో సమన్వయంగా పని చేస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అదనపు డీసీపీలు సమస్యాత్మక గ్రామాలను త్వరలో గుర్తించి తగిన బందోబస్తు చర్యలు చేపట్టే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సైబరాబాద్ పోలీస్ శాఖ అదనపు డీసీపీలు, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, అభ్కరి శాఖ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments