Monday, October 27, 2025

ఎస్సారెస్పీ ఫేజ్–2 ప్రాజెక్టుకు “రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి” పేరు

24 గంటల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం, దామోదర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎస్సారెస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ వ్యాధిని తరిమికొట్టడంలో దామోదర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆ సేవలను స్మరించుకుంటూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్–2ను ఇకపై **“రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి (RD-SSP)–2”**గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే ఆయనకు ఇవ్వగలిగే నిజమైన ఘన నివాళి అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు–భవనాలు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డితో పాటు పలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి తదితరులు సభలో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, వేనారెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!